రామయ్య గారి పెద్దమ్మ
ఆమె అసలు పేరేంటో నాకు తెలియదు. నా చిన్నప్పటి నుండీ ఇతరులు “రామయ్యగారామె” అంటుంటే విన్నాను, నేను “పెద్దమ్మా” అని పిలిచాను. మా అమ్మ మేనమామ భార్య ఈమె. మొదట్నుంచీ ఈమె నాకు విలక్షణంగానే కనిపించేది. ఎక్కడా వూరి గొడవల్లో తలదూర్చగా నేను చూడలేదు, దూర్చిందని ఎవరైనా చెప్పగా నేను విననూ లేదు. ఆమె పనేదో ఆమె చూసుకొనేది. కొందరికామె తల పొగరుది గానో, గర్విష్టిగానో కనపడ్డా నాకామె తల వంచనిదిగా, ఆత్మబలం కలదిగా అనిపిస్తూ వచ్చింది.
మా రామయ్య పెద్దమ్మకి ఒక కూతురూ, ఒక కొడుకూ వుండేవారు. కూతురు కొంచం కచ్చదానిలా వుండేది. ఆమెని నాగయ్య అనే అతనికి ఇస్తే, అతను నాటుబాంబులు చుడుతూ, పొరపాట్న అవి పేలి ఆసుపత్రి పాలయి, ఆ తర్వాత జైలు పాలయ్యాడు. అందువల్ల కూతురు నాకు తెలిసి ఎప్పుడూ వీళ్ళ దగ్గరే వుండేది. ఆ కూతురికి ఒకే కూతురు, పేరు నాగ రత్నం. నాకంటే మూడు నాలుగేళ్ళు పెద్దదేమొ. చిన్నప్పుడు వీధుల్లో వెన్నెల్ల్లో ఆదుకునే పిల్లల గుంపులకు ఆమే నాయకత్వం వహించేది. మాట కొంచం కరుకు, రంగు బాగా నలుపు. అయినా మంచి మెరుపు వుండేది. వున్నంతలో నాగరత్నం అల్లారుముద్దుగానే పెరిగింది. నాగరత్నాన్ని ములకల చెరువు దగ్గర ఎవరికో ఇచ్చి పెళ్ళి చేశారు.
రామయ్య పెద్దమ్మ కూతురు (పేరు గుర్తు లేదు) ఒకరోజు పందిరికింద కూర్చుని బియ్యంలో రాళ్ళేరుతుంటే పందిరి వాసం ఒకటి జారి తలమీద పడి చచ్చిపోయింది. వాళ్ళమ్మ చచ్చిపోయాక నాగరత్నం మా వూరికి ఎప్పుడొగానీ రాలేదనుకుంటా! నాగరత్నం నాన్న జైలు నుంఛీ వచ్చాక ఎక్కడ వుండేవాడో గానీ మా వూరికి ఎప్పుడూ వచ్చినట్లు నేను వినలేదు.
ఇక రామయ్య పెద్దమ్మ కొడుకు, నరసయ్య విషయానికి వస్తే, చిన్నప్పటినుంచీ పెద్దగా కష్టపడిన రకం గాదు. పెద్దయ్యాక కొంచం తాగుడు అలవాటయ్యింది. తాగుడు ముదిరో, తాగింది వికటించో పెళ్ళయిన రెండేళ్ళకే చనిపోయాడు. నరసయ్య భార్య కొద్ది రోజులు ఏడ్చి, పెద్దలు మరో పెళ్ళికి వప్పిస్తే చేసుకొని వెళ్ళిపోయింది.
ఇలా కొడుకూ, కూతురూ తమ కళ్ళ ముందే చనిపోయినా ఎలాగో తమ బ్రతుకు బ్రతుకుతున్న పెద్దమ్మ భర్త వయసు మీదపడి, ఆయనా పోయాడు. తను ఒక్కర్తే అయ్యింది. మనుమరాలు నాగరత్నం దగ్గరికీ ఈమె వెళ్ళలేదు. ఎంత ముదిమి మీదపడ్డా ఎవరిదగ్గరా దేహీ అనలేదు. ధైర్యం సడలిపోలేదు. తనేం సంపాదించేదో, ఎలా వండుకొనేదో గానీ ఆ పూరింట్లో తనొక్కతే జీవించేది. ఎవరైనా దయతల్చి ఆమెకింత కూర ఇస్తే సరే, ఆమె మాత్రం కూర కావాలనో, అన్నం కావాలనో ఎవరింటికీ వచ్చి అడిగేది కాదు. ముఖ్యంగా మా యింటికయితే వచ్చేది గాదు.
ఈమెది మరీ ఛాదస్తం అనుకునే వాళ్ళం. మా అమ్మాయి పుట్టిన రోజు వేడుక వూర్లో జరుపుతూ వచ్చి భోజనం చేసివెళ్ళమంటే రాలేదు. అయితే మనం తీసికెళ్ళి ఇస్తే మట్టుకు తీసుకొనేది. నేను గానీ, అన్నయ్య గానీ, తమ్ముడు గానీ వూరికెళ్ళినపుడు పదో పాతికో చేతికిస్తే తీసుకొనేది.
నాకయితే ఇద్దరు పిల్లలని కని పెళ్ళిళ్ళు చేసి, మనవరాలిని పెంచి పెద్దచేసి పెళ్ళి చేసి, ఒక్కరొక్కరే తనకళ్ళ ముందే రాలిపోతుంటే, ఆమె మానసిక స్థితిని, ఒంటరితనాన్ని తలచుకొంటే బాధతో మనసు విలవిల్లాడుతుంది. తలచుకొనే నాకే ఆ స్థితి అంత దుర్భరమైతే ఆమెకు ఎలా వుంటుందో కదా అని ఎప్పుడూ నాకనిపిస్తూ వుంటుంది. ఇంటికి ఎప్పుడు ఫోను చేసినా ఆమె గురించి వాకబు చేసేవాన్ని.
కొద్ది రోజుల క్రితం మా తమ్ముడితో మాట్లాడుతూ రామయ్య గారి పెద్దమ్మ గురించి వాకబు చేస్తే గుండెను పిండే విషయం తెలిసింది. కొన్నాళ్ళ క్రితమే ఆమె మనుమరాలు నాగరత్నం కూడా ఏదో జబ్బు చేసి చనిపోయిందట! తనచేతుల మీద పెరిగిన తన కొడుకు, కూతురు చివరికి మనుమరాలు కూడా చనిపోయాక చిట్ట చివరిరోజువరకు అత్యంత ఆత్మనిబ్బరంతో స్వశక్తితో, ఎవరి సహాయం యాచించకుండా, ఆశించకుండా బతికిన మా రామయ్యగారి పెద్దమ్మ ఈ మధ్యనే చనిపోయిందని తెలిసి ఉద్వేగానికి లోనయ్యాను.
అంత ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో బతకడం ఎందరికి చేతనవుతుంది? పెద్దమ్మకి వందనాలు.
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: May 23, 2008 సమయము: 10:23 pm
గుండె బరువెక్కిపోయింది.ప్రతీ ఊరులోనూ ఇలాంటి వారొకరు ఉంటారేమో?అంత మంది చావును చూసిన ఆమెకి బ్రతుకంటె ఏమిటో బాగా తెలుసుంటుంది.
తేది: May 25, 2008 సమయము: 8:21 am
నాది కూడా… అవునండి ఎంత మంది అంత నిబ్బరంగా ఉండగలరు? అవి వాళ్ళకి పుట్టుకతో వచ్చిన మంచి లక్షణాలు అనుకోవాలేమో… కానీ ఒకటి మాత్రం నిజం… పాత తరం వాళ్ళల్లో ఏమీ ఆశించకుండా ఎవరినీ ఆశించకుండా తమ తమ కుటుంబాలకి కట్టుబడినట్టు నేటి తరం వల్ల కాదేమో.. చుట్టు పక్కల వాళ్ళ జీవితాలని గమనించి,ఆలోచించి,సానుభూతి చూపించి,వీలైనప్పుడు సాయం చేసిన మీలో ఒక మానవతావాది కనపడ్డాడు…
తేది: May 11, 2009 సమయము: 11:35 am
chala bagundhi andi,