అమెరికా ప్రజాస్వామ్యం — మన రిగ్గింగుకు సామ్యం
అమెరికాలో ప్రత్యక్షంగా అధ్యక్ష ఎన్నికలు గమనించే వరకూ దీని విధివిధానాలు నాకంతగా తెలియవు. అధ్యక్షుడిని ప్రజలే నేరుగా మనం శాసనసభ్యుడిని ఎన్నుకున్నట్లు ఎన్నుకుంటారనుకొనేవాడిని.
కానీ తర్వాత అర్థమయ్యింది ఏమిటంటే అత్యధికుల ప్రజల వోట్లు వచ్చినా అధ్యక్షుడు కానక్కరలేదు అని. ప్రస్తుత అధ్యక్షుల వారు భూషయ్య కూడా అలా అత్యధిక ప్రజాభీష్టం లేకుండానే ఎన్నికయ్యారు 2000 సంవత్సరంలో.
వీళ్ళ ఎన్నిక తతంగం చూస్తే మా రాయలసీమలో చాలా పల్లెల్లో జరిగే ఎన్నికల తంతుకీ దీనికీ పెద్ద తేడా లేదేమో అనిపించింది. అదెలా అంటే…
నాకు తెలిసి చాలా రాయలసీమ పల్లెల్లో వోటింగు ప్రశాంతంగా జరిగినా చట్టబద్దంగా జరగదు. పోలింగుకు ముందే రాజకీయ నాయకులు ఆ వూరిలో పెద్ద తలకాయలతో ఒడంబడికలు చేసుకుంటారు. ఎవరిది ధనబలమూ, కండబలమూ లేక కొండకచో ప్రజాబలమూ వుంటుందో వారు వూరి మొత్తం వోట్లు ఏ అభ్యర్థికి వేయాలో నిర్ణయిస్తారు. ఇక పోలింగురోజు అలా నిర్ణయింపబడిన అభ్యర్థికి అన్ని వోట్లనూ వేసేస్తారు. బయటి వారికి అనుమానం రాకుండా వుండటం కోసం, తర్వాత్తరువాత ఏదైనా విచారణలో దొరక్కుండా వుండటం కోసం ఓ పదో పదిహేనో శాతం వోట్లను అవతలి అభ్యర్థికి వేస్తారు. ఇది అన్యాయమని గొంతు చించుకోనక్కరలేదు. ఎందుకంటే ఇంచుమించు ఇదే పద్దతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికా జరుగుతుంది.
అదెలాగంటే…
సరిగ్గా చెప్పాలంటే అమెరికాలో అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. మనం శాసనసభ్యులను ఎన్నుకుంటే వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకున్నట్లు, అమెరికాలో ప్రజలు ఎలెక్టోరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. ఆ సభ్యులు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే మనకూ వీళ్ళకూ పోలిక అంతవరకే! ప్రతి రాష్ట్రానికీ నిర్దేశింపబడిన ఎలెక్టోరల్ సభ్యులుంటారు. ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఇంకా ఏవో చారిత్రక ఆంశాలను బట్టి (నాకు తెలియదు) కొన్ని రాష్ట్రాలకు తక్కువ మంది, కొన్ని రాష్ట్రాలకు ఎక్కువమంది సభ్యులున్నారు. ఇక్కడ కీలకం ఏమిటంటే ఏ రాష్ట్రంలోనైనా ఎక్కువ ప్రజల వోట్లు వచ్చిన అభ్యర్థికే ఆ రాష్ట్రం యొక్క మొత్తం ఎలక్టోరల్ సభ్యుల వోట్లు వస్తాయి. అంటే మన పల్లెల్లో ఎవరి మాట చెల్లుతుందో వూరి మోత్తం వోట్లు ఒకే అభ్యర్థికి రిగ్గింగ్ చేసినట్లు!
అందువల్ల ఒక రాష్ట్రంలో చాలా కొద్ది తేడాతో గెలిచినా ఆ రాష్ట్రం యొక్క మొత్తం ఎలక్టోరల్ సభ్యుల వోట్లన్నీ ఆ అభ్యర్థికే వస్తుండడం వల్ల, ఒక్కోసారి దేశ అత్యధిక వోటర్లు కోరుకున్న అభ్యర్థి అధ్యక్షుడు కాలేక పోవచ్చు. వుదాహరణకు, 2000ల అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ అభ్యర్థి అల్ గోర్కు 48.4 శాతం ప్రజల వోట్లు, రిపబ్లికన్ అభ్యర్థి బుష్కు 47.9 శాతం ప్రజల వోట్లు వచ్చినా, అల్ గోర్కు 266 ఎలక్టోరల్ సభ్యుల వోట్లు, బుష్కు 271 ఎలక్టోరల్ సభ్యుల వోట్లు రావడంతో బూషయ్యే గెలిచాడు.
అలా చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా గెలిచిన బుష్ గెలవకుండా వుండినట్లయితే ఈ ప్రపంచ చరిత్ర ఇంకోలా వుండేదేమొ!
–ప్రసాద్


తేది: January 4, 2008 సమయము: 12:52 pm
ఫారన్ హీట్ 9/11 లో మైఖేల్ మూర్ ఇదే విషయాన్ని చెప్పాడు
తేది: January 4, 2008 సమయము: 1:03 pm
మీరు మళ్ళీ రాయడం మొదలుపెట్టడం చాలా సంతోషం కలిగిస్తోంది.
రాష్ట్రంలో గెలిచిన అభ్యర్ధికి మొత్తం ఆ రాష్ట్రపు ఎలెక్టొరల్ వోట్లు లభించడం అన్ని రాష్ట్రాలకీ వర్తించదు. మళ్ళీ కొన్నిట్లో నిష్పత్తి ప్రకారం ఇద్దరికీ పంచడం కూడా ఉంటుంది.
తేది: January 4, 2008 సమయము: 1:38 pm
ఇక్కడి ఎన్నికల వ్యవస్థలో ఇలాంటి చెత్తపనులు చాలా ఉన్నాయి ..కొన్ని ఐడియలిస్టు పద్ధతులూ ఉన్నాయి. (ఉదా: బ్యాలెట్లో లేని అభ్యర్ధికి ఓటు వెయ్యగల సౌకర్యం, ఆయా పార్టీల అభ్యర్ధులను ప్రజలే ఎన్నుకోగలగటం) .. ఆలోచించండి కాంగ్రేసు పార్టీకి ఓటేస్తున్నామంటే సొంత ఆలోచనల్లేని ఒక సోనియా తొత్తుగాన్ని ప్రధాని చెయ్యటానికే ఓటు వేస్తున్నామంటే ఎంత వెగటుగా ఉంటుంది.
తేది: January 4, 2008 సమయము: 4:29 pm
నమస్తే చరసాలగారూ! బహుకాల దర్శనం.
పల్లెల్లో పరిస్థితి మీరు చెప్పినట్లే వుండేది. ఈమధ్య మారిందనుకుంటున్నా.
తేది: January 4, 2008 సమయము: 10:03 pm
అయితే అక్కడా ఇలాంటి లొసుగులున్నాయన్న మాట! మనక్కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో పెద్ద రాష్ట్రాలకు పెద్ద చెయ్యి, చిన్న రాష్ట్రాలకు చిన్న చెయ్యీ ఉంటుంది.
అయితే తేడా ఏంటంటే.. మన రాష్ట్రపతి రబ్బరు స్టాంపైతే.. అమెరికా వాడు మిషనుగన్ను!
తేది: January 4, 2008 సమయము: 10:51 pm
ఎక్కడో, వొక దగ్గర సర్దుకోవడం తప్పదు కదా ప్రసాద్ గారు. 51% వచ్చిన వాడు 49% కంటే ఎంత ప్రజాదారణ వున్నవాడెవిటి. ఇది కూడా 100% వోటింగ్లో పాల్గొంటే. లేకపోతే ఏ 35, 40% కే రాజైపోవచ్చు. ఇతే ఒక పద్దతంటూ ప్రజల వొప్పందంతో పెట్టుకున్నాక, అప్పుడప్పుడూ, అక్కడక్కడా తప్పులు జరిగినా ఆ పద్దతి ప్రకారం పోవడవే. పర్ఫెక్షణ్ అనే పదం భాషలో తప్ప వాస్థవంలో నిజం కాదు కదా. కాబట్టి రాయలసీమ పల్లెలైనా, ఫ్లోరీడా రాష్ట్రవైనా పెద్ద భేదవేవీ వుండదు. సంతోషవల్లా ఏ పాకిస్తానో, కెన్యానో కాకపోతే చాలు.
తేది: January 5, 2008 సమయము: 12:46 am
గతం లో ఈ విషయం మీద చదివినా వారు ఇంత సులభంగా అర్దమయ్యేట్లు (నాకు) చెప్పలేకపోయారు. ఆ మధ్య అమెరికన్ పాప్ కల్చర్ గురించి చదువుతుంటే ఒకరు అన్నారు , యధాలాపంగా పుట్టుకొచ్చే కొన్ని ఫ్యాడ్స్ ని కూడా ఒక భారీ పరిశ్రమగా మార్చి విదేశాలకు కూడా ఎగుమతి చేయగల బుర్రలు అక్కడ ఉన్నాయని. అలాంటిది అదికారం చేజిక్కించుకుని ప్రపంచంమీద పెత్తనం చేసేందుకు వీలు కల్పిస్తున్న విధి విధానాలను మార్చేందుకు ఎవరు ఇష్టపడతారు?.
అక్కడ అమలులో ఉన్న రెండు పార్టీల విధానం భారతదేశంలో కూడా రావాలని వాదిస్తున్న మేధావులకు ఆ లొసుగులు తెలియక కాదు. అదొక వాదన అంతే.
భూషయ్య లేదా మన చంద్రబాబు నాయుడు పొగిడే క్లింటనుడు ఎవరైనా అక్కడి వ్యాపారవర్గాల ప్రయోజనాలకు, ముఖ్యంగా యూదుల అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకో లేరు అని అంటారు అది ఎంతవరకూ నిజం? ఇప్పటికి, అప్పటికి చాలా తేడా ఉన్నా సమాజం లో అట్టడుగు వారి గురించి ఆలోచించిన వారిలో అబ్రహాం లింకన్ తర్వాత ఆస్థాయి గల అమెరికా అధ్యక్షులు ఎవరన్నా ఉన్నారా అనే సందేహం తీర్చండి.
వైజాసత్య గారూ సోనియాతొత్తును.. అన్నారు నిజమే. దేశవ్యాప్తంగా కార్యకర్తలున్న వామపక్షాలు కొండొకచో భాజపా కాంగ్రెస్ కు సరైన పోటీ ఇవ్వలేకే గదా ఇన్నిపాట్లు, అలాగా జాతీయస్తాయిలో ఆ పార్టీ ఏదన్నా వస్తే నేను ముందు వరుసలో ఉండి ప్రచారంచేస్తాను. సోనియా దయవల్ల ప్రధాని అయిన పివి నరసింహారావును , అపర చాణుక్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలీ అన్నాంమరి మనమే? రాష్ట్రంలో ఆరెండు పత్రికలు రాజశెఖరరెడ్డి చుట్టూ తిరిగినట్లు, ఎలక్ట్రానిక్ మీడియా చిరంజీవి చుట్టూ మూగుతున్నట్లు , ఇంతమంది నాయకులూ, కార్యకర్తలూ నెహ్రూ వారసుల చుట్టూ ఎందుకు భజన చేసుకుంటూ తిరుగుతూ, ఏళ్ళూపూళ్ళూ ఎందుకు గడిపేస్తున్నారు. సోనీయా కన్నా(వ్యక్తిగతంగా) మేధావులు ఎందరు లేరు? మరి ఏమిటి దీనికి విరుగుడు?
తేది: January 5, 2008 సమయము: 11:44 am
నా బ్లాగులో మీ బ్లాగుకు లంకె వేస్తున్నాను.అభ్యంతరం వుంటే తెలియచేయగలరు.
తేది: January 7, 2008 సమయము: 8:46 am
వ్యాఖ్యలు తెలుగులో వ్రాసుకునే సౌకర్యం కల్పించడం చాలా బాగుంది
ఇతర బ్లాగులలో కూడా ఇలాంటి సదుపాయము కలుగచేస్తే చాలా బాగుంటుంది
నమస్కారాలతో,
సూర్యుడు
తేది: January 8, 2008 సమయము: 11:16 am
@సుధాకర్ గారూ,
అపుడెప్పుడో ఫారన్ హీట్ చూశాను. అందులో మూర్ ఇంకా ఏవేవో విషయాలు చెబుతాడు, బుష్ కుటుంబానికి, లాడెన్ కుటుంబానికీ వున్న సంబందాల వరకూ.
@కొత్తపాళీ గారూ,
ఆ పద్దతి అన్నిరాష్ట్రాలకీ వర్తించదు అనే విషయం నాకు మీ వాఖ్య ద్వారానే తెలిసింది. ఈ అధ్యక్ష ఎన్నికలను మరింత నిశితంగా పరిశీలిస్తాను.
@రవి గారూ,
నిజమే, ప్రతి పద్దతిలోనూ కొంత మంచి కొంత చెడూ వున్నట్లే అమెరికా ఎన్నికలైనా, మన ఎన్నికలైనా.
@రానారె,
నేను చూసినప్పుడు మా పల్లెల్లో పరిస్థితి అదే. ఇప్పుడు మారి వుంటే సంతోషం. క్రితం జరిగిన ఎన్నికల్లో తెలంగాణాలో ఓ వూరు ఎన్నికలను బహిష్కరించిదట. ఏవైనా కోర్కెల సాధనకోసం అలా చేయడం చూస్తూనే వున్నాం కదా, ఇదీ అలాంటిదేనేమొనని వివరాలు చదివా. ఇంతకూ వాళ్ళు ఎన్నికలను బహిష్కరించడానికి కారణం, అటు కాంగ్రెసు నాయకులు గానీ, ఇటు దేశం నాయకులు గాని వాళ్ళకు ఓటేయడానికి డబ్బివ్వలేదట! అదీ వారి కోపం!
@చదువరి గారూ,
ఏ పద్దతైనా అసలు లొసుగులు లేకుండా వుండదు కదా! కాకపోతే ఇక్కడి పద్దతిలో అందం ఏమిటంటే ఓ పద్దతిని నిర్మించుకొని దాన్ని పాటించడం. మనకు పద్దతీ వుండదు, దాన్ని పాటించడమూ వుండదు.
@రవికిరణ్ గారూ,
మీతో వందశాతం ఏకీభవిస్తాను. నాకిక్కడ నచ్చిన విషయం అదే. ప్రతిదానికీ ఓ పద్దతి ఏర్పరుచుకోవడం. ఆ పద్దతి ప్రకారం నడుచుకోవడం. వోటింగులో పాల్గోని వారిని “మౌనం అర్ధాంగీకారం” అన్నట్లు వాళ్ళకి ఏ అభ్యర్థి అయినా ఇష్టమేనని అనుకోవాలి. ఓటేసిన వారిలో అత్యధికులు ఎవరిని వాంఛిస్తున్నారో వాళ్ళు ఎన్నికవడం వుత్తమం అనిపించుకుంటుంది. రాష్ట్రాలు బలంగా వుండి అమెరికా “సంయుక్త రాష్ట్రాలు”గా ఏర్పడ్డప్పుడు బహుశా ఈ పద్దతి ఏర్పడి, ఇప్పుడూ కొనసాగుతున్న పద్దతి అయ్యుంటుంది.
@రాజేంద్రకుమార్ గారూ,
మీ ఆవేదన అర్థం చేసుకోదగ్గది. ఏ విధానంలోనైనా కొన్ని తప్పులు సహజం. బహుళ దృవాలున్న మన సమాజంలో కేవలం రెండు పార్టీలు అన్ని రకాల ప్రజల మనోభావాలను ప్రతిభింభించడం వీలుకాదు. మనకు ఇప్పుడున్న బహు పార్టీ విధానమే మంచిదేమొ, కొద్దిగా మెరుగులు దిద్దితే.
@రాధిక గారూ,
మీ బ్లాగులో నా బ్లాగు లంకెను చేర్చడం నాకు ఆనందదాయకమే గానీ అభ్యంతరకరం కాదు.
@సూర్యుడు గారూ,
ఇలా తెలుగులో వాఖ్యలు రాయగలిగే సౌకర్యం “ఈమాట” వారి సౌజన్యం. ఇది వర్డ్ప్రెస్ బ్లాగులకు మాత్రమే పని చేస్తుంది.
–ప్రసాద్
తేది: February 25, 2008 సమయము: 9:53 pm
ప్రసాద్ గారు,
చెబుతున్నానని మరోలా అనుకోకండి, మీరు వ్రాసిన ‘మనం శాసనసభ్యులను ఎన్నుకుంటే వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకున్నట్లు’ లో ఏదో తేడాఉన్నట్లు అనిపిస్తోంది. శాసన సభ్యులు ముఖ్యమంత్రిని కదా ఎన్నుకునేది, లోక్ సభ సభ్యులు ప్రధానమంత్రిని. మొత్తానికి చాలా బాగా కంపార్ చేసారు.