కర్నాటకం
నాటకంలో మొదటి అంకానికి తెర లేచినప్పటినుండీ బ్లాగుదామనుకుంటున్నా వీలుపడింది కాదు. నాటకానికి తెర పడిందని అందరూ నిట్టూర్పు విడిచేంతలో మరో అంకం మొదలు!
ఈ సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో నిస్సిగ్గుగా అధికారాన్ని పంచుకునే ప్రక్రియ జమ్మూకాశ్మీరుతో మొదలయ్యింది. ఇంతకు మునుపు వూహకైనా తట్టని ఆ ఆలోచన ఇప్పుడు ఎంతగా విస్తరించిందంటే పట్టుమని పదూర్లు లేని పంచాయితీ ప్రెసిడెంటు గిరీని కూడా ఏడాదికొకరని పంచుకుంటున్నారు.
అయితే ఇదింకా సరిగ్గా వ్యవస్థీకృతం కాని కారణాన మొదటి దఫా అధికారం అనుభవించిన వారు తర్వాతి వారికి మొకాలడ్డుతుండటం పరిపాటి అయింది. ఆనక ఓసారి ఉత్తరప్రదేశ్లో ఇదే ఫార్ములా వికటించింది. దీన్ని కూడా చట్టబద్దం చేస్తే ఈ పాట్లు తప్పుతాయామో! ఇన్ని సీట్లు గెలిచిన వారికి ఇన్ని నెలలు అధికార పీఠం అని ఓ చట్టం రాసి పడేస్తే పీడా వదిలిపోతుంది. ఎలాగూ ఎవడు అధికారంలో వున్నా పీకేదేమీ లేదని ప్రజలకు తెలుసు. అందుకే ఎన్ని నాటకాలు ఆడినా మార్పు లేని చెత్త సినిమాలని ఓపిగ్గా చూసినట్లే వీటినీ చూస్తున్నారు.
ఏమైనా సరే వున్న పీఠాన్ని వదల కూడదనే హఠం గౌడగారిదైతే పేరుమార్చుకునైనా సరే అందలమెక్కాల్సిందేనన్న ఆరాటం యడ్యూరప్పది. పిల్లి పిల్లీ తగవు తీర్చినట్లే రొట్టెముక్క కాజేద్దామనే దుర్భుద్ది కాంగిరేసు కోతిది. ఏది ఏమైతేనేం నాటకం అనుకోని మలుపులు తిరిగి మాస్ మసాలా చిత్రంలోని అన్ని రసాలూ వంటపట్టించుకొంది.
అధికారం పొందాలనే ఆరాటపోరాటాలలో ప్రతిసారీ ఓడుతున్నది ఓటరే!
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








తేది: November 22, 2007 సమయము: 6:46 am
చాలా బాగా చెప్పారు. కాని అధికార పంపిడి అనేది మహారాష్ట్ర లో మొదలైంది అనుకుంటా. సినేమా నటులు ఎందుకు రాజకీయాలలోకి వస్తున్నారో ఇప్పుడు బాగా అర్ధం అవుతోంది. రెండింటికీ నటనా కౌశలం అవసరమే
కొంతమంది రాజకీయ నాయకులు సినేమాల్లోకొస్తే మనకి కూడ ఆస్కార్ అవార్డులు వచ్చే అవకాశం తప్పకుండా ఉంది
నమస్కారాలతో,
సూర్యుడు
తేది: November 23, 2007 సమయము: 3:36 pm
పున:స్వాగతం. మా ఊరిలో మంచు లాగా మీ నుండి టపాలు నిరంతరం గా రావాలని ఆశిస్తున్నాను.