ప్రకృతి X మనిషి
ఒక నిర్జన ప్రదేశంలో ఎలా చేరుకొన్నారో గానీ ఓ పదిమంది వున్నారు. వాళ్ళంతా ఆకలి దప్పులతో వున్నారు. అందులో కొందరు తెలివైన వారు, కొందరు మూర్ఖులు, కొందరు పనిచేయగలవారు, కొందరు చేయలేని వారు. ఆకలి అందరినీ సమానంగా వేధిస్తోంది. అలా ఆహారం కోసం వెతుకుతూ వుంటే ఓ పెద్ద చెట్టు నిండా పళ్ళతో వున్నది కనిపించింది. అందరికీ ఆకలి తీర్చేటన్ని పళ్ళు అక్కడ వున్నాయి.
ఇప్పుడు రెండు విధాలుగా జరగచ్చు.
ఒక విధము:
పళ్ళు అందుకో గలిగిన వారు పళ్ళన్నీ తిన్నంతా తిని మిగతావి దాచుకున్నారు తర్వాతి రోజులకు పనికి వస్తాయని. పొడుగ్గా వున్న వారు పైపైన వున్న పళ్ళు కూడా కోసుకో గలిగారు. పొట్టిగా వున్నా తెలివి గలవారు, గురి చూసి కొట్టగలవారు పళ్ళను రాళ్ళతో కొట్టీ, పొడవాటి కర్రలు వుపయోగించి కోసుకున్నారు. చెట్టు ఎక్కగలిగే విద్య తెలిసిన వారు చెట్టు ఎక్కి కోశారు. వీరిలో చేతిలో సంచీలున్న వారు సంచీ నింపుకొని దాచుకున్నారు. పొట్టివారు, చిన్న పిల్లలు పళ్ళు అందుకోలేకపోయారు. పళ్ళు కోయగలిగిన వారిని బ్రతిమాలుకున్నారు ఒక్క పండైనా ఇవ్వమని. వాళ్ళివ్వనప్పుడు వాళ్ళు తిని పారేసిన తొక్కలు తిన్నారు. వీలు కుదిరితే వాళ్ళ సంచీలోంచి దొంగిలించారు. క్రమేపీ పళ్ళున్న వారు పళ్ళు సంపాదించుకోలేని వారిని చూసి అసహ్యంచుకొని దూరంగా నెట్టి వేశారు.
రెండో విధము:
చెట్టెక్క గలవాడు చెట్టెక్కీ, కర్ర వుపయోగించ గలవాడు కర్ర వుపయోగించి, రాయితో గురి చూసి కొట్టగలవాడు గురి చూసి పళ్ళు రాల్చారు. ఈ విద్యలు తెలియని వారు, కర్రలూ, రాళ్ళూ లేని వారు కింద పడిన పళ్ళను ఏరి కుప్ప పెట్టారు. ఏ పని చేయలేని వారు, ఒపిల్లలు, వృద్దులు చెట్టునీడన కూర్చుండిపోయారు. ఆ పూటకి సరిపడా పళ్ళను సేకరించిన తర్వాత అందరూ కూర్చొని వారికి ఆకలి తీరేంత వరకూ తిన్నారు. ఏ పనీ చేయలేని/రాని వారికీ ఆకలి తీర్చారు.
ఇందులో మొదటిది ప్రకృతి ధర్మం. ఇక్కడ బలవంతుడిదే రాజ్యం. ఎవడి చేతిలో విద్య వుందో, బలం వుందో, ఆయుధం వుందో వాడిదే సంపద. ఇక్కడ బలహీనులకు స్థానం లేదు. మనుగడకోసం పోరాటంలో ఎవరు నెగ్గితే ప్రకృతి వారినే జీవించనిస్తుంది.
రెండవది మానవ ధర్మం. బలవంతుడిదే సంపద అవడం, బలవంతంగా ఏదైనా స్వాధీన పరచుకోవడం పశుధర్మం. విచక్షణతో ఆలోచించగలగడం న్యాయానికి భిన్నమైన ధర్మాన్ని ఆచరించడం మనిషి లక్షణం. అయితే మనిషి ఎంత ఎత్తుకు ఎదిగి ఎన్ని సాధించినా ఇంకా పూర్తి మానవుడుగా ఎదగలేకున్నాడు.
–ప్రసాద్
ఈ-మెయిల్ చెయ్యండి
ముద్రించు








(6 ఓట్లు, సగటు: 5 కు 4.33)
తేది: July 20, 2007 సమయము: 5:07 pm
రెండో విధంలో చెప్పినట్టు అందరూ అలా ఆలోచించి సమ సమాజం వస్తే ఎంత బాగుండు. మనిషి మనీషిలా మారినప్పుడే లోకకళ్యాణం.
తేది: July 21, 2007 సమయము: 12:27 am
‘ నరుడు నరుడౌట ఎంతో దుష్కరము సుమ్ము ‘ అంటారు దాశరధి, గాలీబు గీతాల అనువాదంలో. పశువులకి, మనుషులకీ మధ్య తేడా విచక్షణే. స్వార్ధానికీ, లోభానికి లొంగిపోయి మనిషి పశు స్థాయిలోనే ఉండిపోతున్నాడు. వీటిని దాటి మనవత్వం కల మనిషిగా ఎదిగితేనే ‘సర్వే జనా సుఖినో భవంతు ‘ అన్న ఆర్యోక్తి సార్ధకం అవుతుంది. ఇదే నేటి అవసరం కూడా.
తేది: July 21, 2007 సమయము: 1:28 am
విధము 3: చెట్టెక్కడం రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఎక్కడం నేర్పారు. అది చెయ్యలేని వాళ్ళకి రాళ్ళున్నవాళ్ళు కొన్ని రాళ్ళిచ్చి ఎలా కొట్టుకోవాలో నేర్పారు. అందరూ చక్కగా ఎవరిపళ్ళు వాళ్ళు కోసుకు తిన్నారు. పండు కోసుకుతినడంలోని ఆనందం అనుభవించారు. వృద్ధులనీ, పిల్లలనీ అందరూ ఆదరించారు. బలహీనత ముసుగులో బద్ధకం పెరగకుండా చూసారు. అందరూ ఆనందంగా ఉన్నారు.
తేది: July 21, 2007 సమయము: 3:22 am
చెట్టెక్కడం వచ్చిన వాళ్ళు కూడా రానట్టు నటించసాగారు. పండ్లు కొట్టుకొచ్చిన వారి దగ్గర నుంచి తమ హక్కుగా పండ్లు తీసుకోసాగారు.
కొన్నాళ్ళకు ఊరికే తినే వారిని చూసి వారు కూడా పని చెయ్యాల్సిందే అంటే ధర్నాలు మొదలెట్టారు.
మధ్యలో ఇంకొందరు మేము కూడా ఆ గ్రూపే అని, మమ్మల్ని కూడా చేర్చాలనీ ప్రొటెస్టులు.
అంతా కలగాపులగం అయింది.
తేది: July 22, 2007 సమయము: 10:55 pm
సమసమాజంలో శ్రీరాం, ప్రవీణ్ లు చెప్పినట్లే జరుగుతుంది. మన సంస్కృతిలో క్యాపిటలిజానికి ఆధ్యాత్మికత జోడించడం వల్ల కొంత మెరుగ్గా ఉండేది. ఇప్పుడు ఆధ్యాత్మికతలో వ్యాపారధోరణి, వ్యాపారంలో అనైతికధోరణి ఎక్కువ అవడం మన ప్రస్తుత సమస్యలకి మూలమనిపిస్తుంది.
తేది: July 23, 2007 సమయము: 5:14 am
ప్రవీణ్ గారి comments లో కొంత నిజం లేకపోలేదు. దీని పరిష్కారం sriram గారి comments వుంది. నాకు sriram గారి comment చాలా నచ్చింది.
తేది: July 23, 2007 సమయము: 12:55 pm
ప్రవీణ్, శ్రీరాం గార్లు మరిన్ని విధాలు జోడించినందులకు కృతజ్ఞతలు.
నిజమే అన్ని రకాల వాళ్ళూ వుంటారు. దొంగలనీ, నటించే వాళ్ళనీ వాళ్ళ ఖర్మకు వాళ్ళను వదిలేసినా కోసుకునే విద్య తెలిసినవాడివే పళ్ళన్నీ అవవు గదా? మానవ ధర్మం ప్రకారం పళ్ళెవరు కోసినా అందరూ పంచుకోవడమే ధర్మం.
–ప్రసాద్
తేది: July 24, 2007 సమయము: 11:40 pm
ప్రసాద్ గారు, ఆ పళ్ళు పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాడు ఆకలి తీర్చుకుంటే మహదానందమే….దాన్ని అమ్మి సారానో మరొకటో తీసుకుంటాడేమో గమనించి పంచుకోవాలి. లేకుంటే…మనం పళ్ళన్నీ బురదలో పోసినా అట్లాంటోళ్ళకిచ్చినా ఒక్కటే అవుతుంది.