తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలు
ప్రత్యేక తెలంగాణాకు అనుకూలమా, వ్యతిరేకమా అనిగాకుండా నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఈ అసమ్మతి ఎమ్మేల్యేలు చేస్తున్నది అక్షరాలా అక్రమం.
గులాబీ కండువా పైన వేసుకుంటారు. లోపల కాంగ్రెసు వాదిలా ప్రవర్తిస్తారు. కారు చిహ్నంతో గెలిచారు, కెసీయార్ నాయకత్వాన్ని నమ్ముకున్నారు, ఎన్నికల్లో మీరు తెరాసవాదులనే ప్రజలు గెలిపించారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక అటు ప్రజలనూ మోసం చేసి ఇటు కేసీయార్ను మోసం చేసి రాజశేఖరరెడ్డి వెనకాల తిరగడం ఏ విధంగా న్యాయం.
సరే మీకు కేసీయార్ నచ్చలేదు. ఆయనకంటే మీకే ప్రత్యేక తెలంగాణా మీద ప్రత్యేక అభిమానం వుంది. మరి ఇంకా ఆ గులాబీ కండువానే ఎందుకు? దానితో గెలిచిన ఎమ్మెల్యే గిరీ ఎందుకు? రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. ఒకరిమీద ఒకరు తొడలు చరుచుకున్నందుకే ప్రజలు ఎన్నికలు భరించారు. మీరు రాజీనామా చేస్తే మాత్రం భరించలేరా? ఇలా అటూ ఇటూ గాని మద్యెరకం గాళ్ళలా ఈ వేషాలెందుకు?
–ప్రసాద్


తేది: March 22, 2007 సమయము: 3:05 am
అసలు దేశంలోనే ఏ రాష్ట్ర ఉద్యమానికి లేనంత ప్రజల మద్ధతు, చరిత్ర ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమం సఫలం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడానికి స్వార్ధ రాజకీయాలు కూడా ఓ ముఖ్యమైన కారణం.
తెరాస అసమ్మతి నేతల విషయమే చూడండి. రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయమన్నదుకు సంతోష్ రెడ్డికి కేసీయార్ పై కోపం వచ్చింది. పార్టీ కి రాజీనామా చేశాడు. కొన్నాళ్లు కాంగ్రెస్ కు దగ్గర గా తిరిగాడు. ఆ తరువాత మళ్లీ తెరాసలో చేరాడు. మళ్లీ బయటికి వెళ్లి ఇప్పుడు విజయశాంతి పార్టీలో చేరాడు.
వీళ్లు నిజమైన తెలంగాణా వాదులయితే మీరన్నట్టు రాజీనామ చేసి గెలవాలి. ఇక వీళ్లంతా శాసన మండలి ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ కు మద్ధతు ఇవ్వడం అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట.
ప్రజలు వీళ్ల పై ఎంత కోపంతో ఉన్నారో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వీరు నిలబెట్టిన/మద్దత్తిచ్చిన అభ్యర్దులంతా చిత్తుగా ఓడిపోవడం చెబుతోంది.
చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరకుండా తెలంగాణ ప్రజానీకం జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఎంతుందో వీరి ఉదంతమే చెబుతోంది.
తెలంగాణ ఉద్యమానికి చీడ పురుగులు వీళ్లు. వచ్చే ఎన్నికల్లో వీరికేగతి పడుతుందో చూడండి.