గుండెల మీద చెయ్యేసి చెప్పండి మనది సహనశీలతా? గుండె నిబ్బరమా? చేతగాని తనమా?
ఖచ్చితంగా చేతగాని తనమే. ఇందుకు బోలెడన్ని ఋజువులు. నీవు తన్నగలిగిన వాడివై వుండికుడా తన్నలేదంటే అది సహనం. తన్నలేక శాంతి గురించి మాట్లాడితే అది బలహీనత. అప్పుడెప్పుడో అశోకుడు పటించింది అసలుసిసలు శాంతి మంత్రం.
వాడెవ్వడో వచ్చి 18 సార్లు దండెత్తితే 17 సార్లు గెలిచామని చెప్పుకోవడం కాదు వాజమ్మల్లాగా, అసలు వాన్ని రెండోసారి మళ్ళి ఎలా తొంగిచూడనిచ్చామనేది అసలు ప్రశ్న. ఒక్కరా ఇద్దరా… రాజన్న ప్రతివాడికీ లోకువయ్యాం. అప్పుడూ అటువైపు నుండే దాడులు… ఇప్పుడు అటువైపు నుండే దాడులు. అప్పుడంటే నూటొన్నొక్క విడివిడి రాజ్యాలుగా వున్న భరత ఖండం ఒక్కటై ఎదుర్కోలేక పోయింది అనుకున్నా, మరిప్పుడు మనకు లోటేమిటి?
ఒకటే లోటు. నాకెందుకు అనే నిర్లిప్తత! రాసి పెట్టి వుంటే జరగకపోతుందా అనే బుద్దిమాలిన కర్మ సిద్దాంతం. పక్కిల్లు కాలుతుంటే మనంటిమీద నీళ్ళు చల్లుకునే స్వార్థ చింతన. ఇవే మన అద్బుతమైన బలాలు. ఒక్కోసారి నాకనిపిస్తుంది ఇవేనా మనలని ఒక్క భారతదేశంగా వుంచుతున్నది అని. లోపల్లోపల అరవోడు అంటే తెలుగోడికి గిట్టదు. తెలుగోడంటే కన్నడిగుడికి గిట్టదు. వీళ్ళంటే ఎవరో హిందీ వోడికి తెలవదు. ఆ హిందీవోడంటే అస్సామీయుడికి గిట్టదు. అయితే ఇన్ని భిన్నత్వాల మధ్యా మనం ఒకదేశంగా వున్నామంటే నిజంగానే మొన్న అరవై వసంతాల స్వాతంత్ర్యదినం నాడు అనుకొన్నట్లు ఏదో బ్రహ్మ పదార్థం అనే దారం మనలని కలిపి వుంచుతోందా? నాకయితే ఆ బ్రహ్మ పదార్థం పైన చెప్పిన నిర్లిప్తత, స్వార్థం, చేతగానితనం కాదుగదా అనిపిస్తుంది.
బాంబుదాడుల్లో యాబై మంది చచ్చినా అది వారి ప్రారబ్దం అనుకుంటాం. మన ఆత్మను తృప్తి పరచడానికి పూలగుచ్చాలు పెడతాం, క్రొవ్వొత్తులు వెలిగిస్తాం, సర్వ మత ప్రార్థనలు చేస్తాం. ఇవి చనిపోయిన వారి ఆత్మను ఏమోగాని బతికివున్న వారి ఆత్మను సంతోషపర్చడానికే. ఈ చేతగానిపనుల వల్ల ఒనగూడేదేమీ లేదు, ఆ దుర్ఘటనని మరిచిపోవడానికి వుపకరించడం తప్ప. మనకు కావలిసింది మరచిపోవడం కాదు. గుర్తుంచుకోవడం. మనం దీన్ని మరవకూడదు. ఆ బాంబులు మన గుండెల్లో రోజూ బ్రద్దలవ్వాలి. ఆ ఆక్రందనలు ప్రతి క్షణమూ మన చెవుల్లో మ్రోగుతూ మనలని నిరంతరం జాగృతులుగా వుంచుతూనే వుండాలి. మన ప్రజాస్వామ్య విలువల వలువలు ఎవరొలుస్తున్నారో వారి తోలు వలవాలి. అది నిర్లక్ష్యపు పౌరుడు కావచ్చు, అవినీతి అధికారి కావచ్చు, నిజాయితీలేని రాజకీయుడు కావచ్చు, ఒక మతం పేరుతో మరో మత వర్గీయుల మీదకి వేట కుక్కలని వుసిగొలిపే థాకరే గావచ్చు లేక మసీదు లోగిలి నుండీ మరణ శాసనాలు రాసే ఇమాం కావచ్చు.
మన ప్రభుత్వాలు చేతగానివైతే మనమైనా చేవవున్నవాళ్ళమని నిరూపించాలి.
–ప్రసాద్