ముళ్ళపొదలు

తేది:November 20, 2006 వర్గం:పుస్తకాలు రచన:charasala 538 views

ఇది అంపశయ్య నవీన్ మరో అంపశయ్య. నిజానికి ఇది అంపశయ్యకి పొడిగింపని చెప్పవచ్చు. అంపశయ్యలో వున్న పాత్రలే ఇందులోనూ కనిపిస్తారు. అంపశయ్య ఓ 14 గంటలలో నడిచిన విధ్యార్థి జీవితమైతే ఇది ఐదుగురు నిరుద్యోగుల 14 గంటల జీవితం.
ఇలాంటి అంతర్ముఖంగా మనసు పోయే పరిపరి దారులను పట్టివ్వడంలో నవీన్‌ది అందెవేసిన చెయ్యిలా వుంది. ఈయన మిగతా నవలల్లో కూడా ఈ శైలి కనిపిస్తూ వుంటుంది.
రవి, వేణు, నిధి, రమేష్, సాగర్ అనే అయిదుమంది నిరుద్యోగులు పొద్దున్నే నిద్దుర లేచి తమతమ విభిన్న వ్యాపకాలలో తిరిగి మళ్ళీ రాత్రి కలుసుకొనేదాక ఒక్కొక్కరి జీవితంలో జరిగిన సంఘటనలు, వారి అంతర్మధనం ఈ నవల.
ఒకడు ఒకామెను ప్రేమించడం, ఆమె ప్రేమకు సమ్మతించకపోవడం, లేదా వాళ్ళ ప్రేమకు దుర్మార్గుడైన ఆమె తండ్రి ఒప్పుకోకపోవడం ఇది కథైతే ఇలాంటి కథ ఇందులో లేదు. ఇందులో సాధారణ యువకుల ఒకరోజు జీవితం వుంది. ఆదర్శాలతో రాజీ పడేవాడు ఒకడైతే, ఆదర్శాలకోసం జైలు కెళ్ళినవాడు ఇంకొకడు. సిగరెట్టు ముక్కకై పీకలమీదకు తెచ్చుకున్నవాడు ఒకడైతే, వుద్యోగం వస్తుందనే ఆశతో తప్పుడు సాక్ష్యం ఇవ్వడానికి సిద్దపడిన వాడు ఇంకొకడు.
ఇవన్నీ ఒక ఎత్తైతే అవినీతి రాజకీయాలు, దుర్మార్గులైన ప్రొఫెసర్లు ఇలా వివిధ రకాల పాత్రలు ఎలాంటి శషబిషలూ లేకుండా దర్షనమిస్తాయిందులో.

–ప్రసాద్

విచలిత (అంపశయ్య నవీన్ నవల)

తేది:November 6, 2006 వర్గం:పుస్తకాలు రచన:charasala 588 views

తప్పు చేసిన యువకుణ్ణి మందలించి సరైన దారిలో పెట్టిన వైనం అదే తప్పు చేసిన స్త్రీని మాత్రం క్షమించకుండా జీవితాన్ని మోడును చేసిన సమాజం తీరును ఇందులో రచయిత “అంపశయ్య నవీన్” చక్కగా చిత్రీకరించారు.
అంతా చదివాక మనసు వికలమవుతుంది.
ఉపేందర్ లైంగిక వాక్షతో చదువు పాడుచేసుకొని ఇంటికి చేరతాడు. పల్లెలో ఇంటిదగ్గర కూడా చెడు సావాసాలతో చెడుతిరుగుళ్ళు చూసిన ఇంటి పెద్ద అన్నయ్య అతనికి పెళ్ళి చేయడమే విరుగుడు అని భావిస్తాడు. పేళ్ళి చేసుకున్నాక ఉపేందర్ భాద్యతతో ప్రవర్తించి మంచి పేరు తెచ్చుకుంటాడు.
కానీ అతని భార్య శకుంతల తన కలలు తీరకపోవటం, పని ఒత్తిడిలో భర్త పట్టించు కోకపోవటం, అదే అదనులో జగన్నాధం అరచేతిలో వైకుంఠం చూపించి ఆమెను వశపరచుకోవటం జరుగుతుంది.
జగన్నాధంతో వుండగా చూసిన ఉపేందర్ అన్న రాఘవయ్య ఆమెను జగన్నాధంతో వెళ్ళడమో లేక పుట్టింటికి వెళ్ళడమో అన్న రెండే అవకాశాలు ఇస్తాడు.
చివరికి పుట్టింటికే వెళ్ళిన శకుంతల మొగుడు విడిచిన ఆడదిగా పలువురు చేత మోసగింపబడి చివరికి వేశ్యగా మారిపోతుంది.
రచయిత ఉపేందర్, రాఘవయ్య, శకుంతల, జగన్నాధం లాంటి పాత్రలను వారి వారి అన్ని కోణాలనుంచీ సమంగా పోషిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో శకుంతల తప్పు చేసిందో చాలా ప్రతిభావంతంగా వివరిస్తాడు.
–ప్రసాద్

ఆడబాప

తేది:October 25, 2006 వర్గం:నా ఏడుపు, పుస్తకాలు రచన:charasala 695 views

సౌమ్య గారి సమీక్షలతో ఉక్కిరి బిక్కిరయ్యి నేను కూడా అంపశయ్య నవీన్ పుస్తకాలు (http://www.avkf.org ద్వారా) తెప్పించుకొని చదివాను. తెలంగాణ మీద సర్వత్రా చర్చ జరుగుతున్న ఈ రోజుల్లా దాని చరిత్ర చదవాలనే వుత్సాహము కూడా నాకుంది. అయితే నవీన్ నవలాత్రయం(కాల రేఖలు, చెదిరిన స్వప్నాలు, బాందవ్యాలు) అంతగా తెలంగాణా చిత్రాన్ని చిత్రించలేకపోయిందనేది నా అభిప్రాయము. ఈ నవలాత్రయములో మొదటి నవల కాలరేఖలు చదువుతూ వుంటే చాలా చోట్ల చదవకుండా పేజీలు తిప్పేద్దామనే బోర్ కొట్టింది. రచయిత తనకు గుర్తున్న బాల్యాంశాలతోనే పెద్దగా కృషి చేయకుండా వ్రాశాడనిపించింది. చెప్పిందే పదే పదే చెప్పడం చిరాకు తెప్పించింది. “ఊరు మీద ఊరు పడేయడం” ఎన్నిసార్లు వుంటుందో లెక్క లేదు. ఇంకా కాలరేఖలులో హీరో “రాజు” చిన్నపిల్లవాడు గనుక, నవల అంతా అతని దృక్కోణము నుండీ చిత్రీకరించడం వల్ల లోతైన విషయాలు చెప్పలేకపోయారు (పిల్ల వాళ్ళకు పెద్ద విషయాలు ఏమి తెలుస్తాయి). అలాగే పిల్లాడికి బస్సును చూడటం ఒక అద్భుతం, రైలు చూడటం ఇంకో అద్భుతం. కానీ ఇవన్నీ ఇప్పుడు చిరపరిచయాలయిపోయాక వాటిని గురించి ఏమి చదవాలనిపిస్తుంది? ఇక మాట్లాడితే ఎద్దులబండి సవారీ, ఇది కూడా పలుమార్లు అదేవరసలో వివరించడం. ఇంకా కొన్నిసార్లయితే నవలలో ఇంతకుముందే చర్చించిన విషయాన్ని చర్చించామన్నది గుర్తుకు లేక మళ్ళీ రాసినట్లు వుంది. రజాకార్ల ఆగడాలు, కమ్యూనిస్టు వుద్యమము, ఫ్యూడల్ కట్టుబాట్లు వీటిగురించి ఇవ్వాల్సినంత సమాచారము ఇవ్వలేదనిపిస్తుంది.
ఇక నాకు నచ్చిన విషయం ఏంటంటే నవలంతా అసలైన తెలంగాణా మాండలికంలో సాగడం. ఆ నవల చదువుతున్నన్ని రోజులూ నేను ఇంట్లో కూడా ఆ యాసలోనే మాట్లాడటం నాలుకపైకి వచ్చేసేది.
నన్ను కదిలించిన నేను కొత్తగా ఈ నవలనుంచి తెలుసుకొన్న అంశము “ఆడబాప” గురించి. అప్పుడెప్పుడొ రాజుల కాలంలో రాజకుమారితో పాటు ఆమె చెలికత్తెలను కూడా అత్తగారింటికి పంపేవారని తెలుసు. కానీ నిన్నమొన్నటి దాకా తెలంగాణలో వున్నదని తెలిసి మూగపోయాను. జోగిణి ఊరి ఆస్తి అయితే ఈమె ఇంటి ఆస్తి. ఇంటికొచ్చిన అథిధుల కోర్కెలు, ఇంటి పెద్ద కోర్కెలు (ఇల్లాలు బహిష్టు అయినప్పుడట) తీర్చాలట. ఈమెకు పుట్టిన ఆడపిల్లలు ఇంకో ఇంటికి ఆడబాపలుగా వెళ్తారట! మగవాళ్ళైతే జీవితకాలం పాలేరుగా పనిచేస్తాడట! ఎంత అన్యాయమని రాజు వాళ్ళ అత్తయ్య దగ్గర ఘోషిస్తే, ఆడబాప అలాగాక ఇంటిముత్తైదువలా వుంటుందా అంటూ తెగ ఆశ్చర్యపడిపోతుంది. ఆమె కర్మ అలావుంది, లేదా ఆమె రాత అలా వుంది అని సరిపెట్టుకుంటే, ఆచారం యొక్క బలం మామూలు విచక్షణా జ్ఞానానే హరించివేస్తుందంటే, ఈ ఆచారాలు ఎక్కడ సృష్టింపబడ్డాయో గానీ ఎంత బలంగా పాదుకొనబడ్డాయి!!
ఈ ఆడబాప గురించి బుర్రంతా తెగ బాధపడిపోతున్నప్పుడు తీవ్రంగా ఆలోచిస్తే ఈ సాంప్రదాయపు పెళ్ళిల్లు కూడా అలాంటివేనా? సాంప్రదాయపు కోరల్లో చిక్కుబడి రాజు అత్తయ్య అమాయకంగా ప్రశ్నించినట్లే పెళ్ళి చేసుకున్నాక అతనితో గాక ఇంకెవరితో సంసారము చేస్తుంది అని మనం సాప్రదాయపు పెళ్ళి ఉచ్చులో చిక్కుబడ్డ అబల గూర్చి ఆలోచిస్తున్నామా అని పిస్తుంది. లేకపోతే ఒక్కసారి పెళ్ళయిందంటే ఇక అతనే నీ మొగుడు అని కానీ లేదా ఆమే నీ పెళ్ళాం అని గానీ అనడం సంస్కారం కాదేమొ అనిపిస్తోంది. ఆడబాపగా పుట్టినందుకు నీకిక అదే జీవితం అనడానికి ఇష్టమున్నా లేకపోయినా అతడే/ఆమే నీ మొగుడు/పెళ్ళాం అనడానికి నాకట్టే తేడా కనిపించలేదు. అలాగని పశ్చిమ దేశాల్లోలాగా ఎప్పుడంటే అప్పుడు విడిపోవడం వ్యక్తి స్వేక్ష వరకూ బాగానే వుందిగానీ, అటు తల్లో ఇటు తండ్రో పిల్లలకు దక్కకుండా పోతున్న వైనం సమాజశ్రేయస్సుకు ఉపయుక్తంగా లేదు. వ్యక్తి శ్రేయస్సు ముఖ్యమా? సమాజ శ్రేయస్సా అంటే సమాజ శ్రేయస్సేనేమొ!
ఇక మిగతా రెండు నవలలు (చెదిరిన స్వప్నాలు, బాందవ్యాలు) ఫరవాలేదని పించాయి. అదికూడా కుటుంబసంబదాల కోణంలో చిత్రీకరణ బాగా వున్నా చరిత్ర కోణంలో అంత బాగాలేదనే చెప్పాలి. ఇందులో వున్న చరిత్ర సాంఘిక శాస్త్రము చదివిన ఏ హైస్కూలు కుర్రాడికయినా తెలిసిందే. అసలు చైనాకు ఇండియాకు జరిగిన యుద్దానికి ముందు దానికి దారితీసిన పరిస్థితులి ఏమిటి? లేదా పాకిస్తానుతో యుద్దాలకు దారితీసిన పరిస్థితులేమిటి ఇత్యాది వివరాలేమీ లేవు. పోనీ ఈ నవలాత్రయము తెలంగాణా చరిత్రకే పరిమతమనుకున్నా, ముల్కీ రూల్స్ చరిత్ర గానీ, వాటిని కోర్టు రద్దు చేసిన దాని వెనుక భిన్న వాదనలు గానీ ఈ నవలలు చూపించవు.
ఇక ఈయన రచనలు కూడా నిండుగా, గంబీరంగా సాగుతాయే కానీ మచ్చుకు కూడా ఒక సరదా సన్నివేశము కనపడదు. పోనీ సీరియస్ విషయమైనా గుండెలు కరిగేలా చెబుతారా అంటే అదీ కనపడదు. మాదిగ వాడలో చొరబడి ఒకరిని మానబంగము చేసి ఇంకిద్దరిని చంపి గుడిసె తగలబెట్టిన విషయాన్ని కూడా చాలా మామూలుగా చెబుతారు.
వీటికి ముందే ఈయనకు పేరు తెచ్చిన అంపశయ్య చదివాను. అది ఒక 14 గంటల విషయము కాబట్టి చాలా చిక్కగా వుందనిపించింది. గడగడా చదివేలా చేసింది. సగటు విధ్యార్థి జీవితంలో ఒకరోజు ఎలా గడుస్తుందో ఇది సరిగ్గా అలానే గడిచింది. అందువల్ల చదివే ప్రతి ఒక్కరూ దానిలో తన జీవితాన్ని చూసుకొని లీనమయిపోతారు. కాకపోతే కాలేజీ జీవితంలో అనుకునే పచ్చి శృంగార భావనలని కూడా అలాగే ముద్రించడంతో కొంత సెన్సార్‌షిప్ అవసరమేమొ అనిపించింది.
–ప్రసాద్

అంజాన్

తేది:August 30, 2006 వర్గం:పుస్తకాలు రచన:charasala 594 views

(రచయిత అనుమతితో నాకు బాగా నచ్చిన కవిత “సందుక” నుండి)

తలపై
రెండు నిండు మట్టికుండలతో

అరచేతుల్లో
ఎగరడానికి సిద్దంగా ఉన్న పక్షిపిల్లలతో

దూదిమబ్బుల
నీలినీటి ఆకాశం తెరలపైన తేలుతూ

పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…

విమానం కిటికీల్లోంచి
కింద
వంటి మీద
కొత్త కొత్త నగల్తో కొత్త కొత్త వలువలతో
కొంగ్రొత్త చూపుల్తో
నా నగరం…

నా ఆదిమ ప్రేయసి!

నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా.

తెగిపోయిన నా రెక్కల్ని
సుతిమెత్తని చేతులతో నిమిరి
నా భుజాలకు అతికిస్తుందనుకున్నా.

నేను మోసుకొచ్చినవన్నీ
తనివితీరా తడిమి
అతి జాగ్రత్తగా
చీరకొంగులో పొదుపుకుంటుందనుకున్నా.

ఏడేళ్ళ నవ్వుల్నీ
పచ్చి నెత్తుటి కన్నీరు మరకలనీ
కాళ్ళ కింద నలిగిపోయిన పసిరెక్కలనీ
వాడిపోయిన కళ్ళనీ వేలాదిగా రాలిపోయిన పూలరెమ్మలనీ
ఏకబిగిన ఏకరువు పెట్టి ఊపిరాడనీయదనుకున్నా!

నేలకు దిగిన విమానంలా
వంటరిగా దిగాలుగా
నేను

నా ప్రేయసి
నా ముందు నుంచే హడవుడిగా
అటు ఇటూ నడిచిపోయింది.

ఊరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని మూఖాల మెరుపులతో
సరసరా జారిపోయింది.

నావైపు చూసే తీరికలేదు
చూసినా గుర్తుపట్టలేదు.
అర్ధరాత్రి వర్షపు చీకట్లో పారేసుకున్న
ఉంగరంలా
జరజరా దొర్లిపోయింది.

యుగాలుగా
తన ఎడతెరిపి లేని దుఃఖ బీభత్స ప్రేమ ప్రవాహంలో
మునిగిన నన్ను
ఏడేళ్ళ ఎదబాటుతోనే పూర్తిగా మర్చిపోయింది.

నా ఊపిరి తేమలోని వెచ్చదనాన్నీ
నా పెదవుల ముద్దులోని ఉప్పదనాన్నీ
నా కౌగిలింతలోని చెమటవాసననీ

తానెన్నడూ ఎరగనట్టే
ఎడమొఖమై అంజాన్ కొట్టింది

నేనే మనసుండబట్టలేక
గ్యాపకాల సుడిగాలులతో పిలిచినా
రెండు చేతులూ విరగబూసి చాచినా
ఎవరు నువ్వు అన్నట్లుగా
ఎకసెక్కెపు చూపుల్ని విసిరి పారేసింది.

మట్టినీటి కుండలు పగిలి
రెక్కలు రాని పక్షి ఈకలు చెదిరి
నేల మీద కలలను ఏరుకుంటున్న
నన్ను

దారికడ్డం లెమ్మంటూ
నూకేసి విసవిసా పోయింది.

నిలువునా తడిసి ముద్దైన నేను

స్పర్ష మరిచిన
ప్రేయసి తడి లేని చూపుల ముందు

నాకు నేనే అజ్ఞబీని!

(రచన: నారాయణస్వామి)

 

 

సందుక

తేది:August 29, 2006 వర్గం:పుస్తకాలు రచన:charasala 825 views

ఇది నారాయణస్వామి గారి కవితా సంపుటి.
తెలంగాణా పల్లె జీవితాల శ్వాస ఇది. యాస వేరేనే గానీ ఆత్మ ఒక్కటే .. అది తెలంగాణా అయినా రాయలసీమ అయినా.. మా ముసలి అవ్వ నా వీపు నిమిరినంత అనుభూతి. వూరికి ఫోను చేసిన ప్రతిసారీ “ఎప్పుడొస్తావు నాయనా” అని అడిగే ఆప్యాయపు పలుకుల్ని ఈ కవిత మళ్ళీ గుర్తు చేసి గుండె తడిని మరింత పెంచింది.

“మల్ల యెప్పుడొస్తవు కొడుక”

యేండ్ల ముచ్చట్లు చెప్పుకోనే
బుద్ది తీరకముందే
బయల్దేరిన
నా చెయ్యిని చేతులల్లకు తీసుకుంది -

గుడ్డి అద్దాల కండ్లెనుక
కుర్వక కుర్వక కుండపోతగ
కురిసిన వానసుంటి
ఆపేక్ష-

ఎన్నో కోల్పోతున్నామనే బాధ మనసును ఎల్లవేళలా మెలిపెడుతూనే వున్నా ఈ స్వామి కవితలు చదివాక నా మనసు పడే బాదకు అక్షర రూపమిదేనా అని మళ్ళీ మళ్ళీ వాటిని తడిమి చూసుకుంటున్నా.

“నీ ల్లు లేవు
బెక బెక కప్పల్లేవు
మునుగుకుంట తేలె
బుడుబుంగల్లేవు”

నేను అమెరికా వచ్చిన ఈ ఎనిమిదేళ్ళలో ఒక్కసారే ఇండియా ద‌ర్శనం వీలయ్యింది. ఆ ముప్పై రోజుల్లో కూడా అరవై పనికిరాని పనులతో ఇండియా కౌగిల్లో నిశ్శబ్దంగా ఒదిగి వూసులాడుకొనే భాగ్యం కలగలేదు. నేను వచ్చేప్పుడు చిన్న పిల్లలుగా వున్న వాళ్ళు పెద్దవాళ్ళయ్యారు, నన్ను గుర్తుపట్టలేని వారు మా వూర్లోనే చాలామంది అయ్యారు. ఈసారి నా సంద‌ర్శనలో నా బావాలు ఎలా వుంటాయో స్వామి గారు నాకు భవిష్యద్ద‌ర్శనం చేయించారు ఈ “అంజాన్” కవితలో.

“పేగు తెంచుకున్న నేల మీద
పెంచుకున్న ఎనలేని ప్రేమతో
రాలాను…”
….

నాకోసం నిద్రమాని
‘ఇణ్ణేళ్ళుగా ఏమైపోయావ్’ అంటూ
కోపంతో అలకతో ప్రేమతో
నీరు పొర్లుతున్న చెరువుల కళ్ళతో
నన్నలుముకుంటుందనుకున్నా

….

నా ప్రేయసి
నా ముందు నుంచే హడావుడిగా
అటూ ఇటూ నడిచిపోయింది.

ఉరుకులతో పరుగులతో
నాకు అతి కొత్తయిన భాషల చప్పుళ్ళతో
నేను పోల్చుకోలేని ముఖాల మెరుపులతో
సర సరా జారిపోయింది.

నావైపు చూసే తీరిక లేదు
చూసినా గుర్తు పట్టలేదు.”

ఇలా ఈ కవిత మొత్తం చదువుతున్నంత సేపూ నా ప్రియమైన నెచ్చలి నాకు దూరమైన బాధలాగే గుందెను మెలిపెట్టింది.

“గాల్లోకి ఎగిరాక గానీ” కవిత చదువుతుంటే ఏ ప్రవాసుడికైనా కన్నులు చెమ్మగిల్లక మానవు.
“వణుకుతున్న చేతులతో
ముఖాన్ని తడిమిన
మట్టి ఆత్మీయత
అర్థం కాదు”

ఇక తుపాకుల మోతల మద్య మోడులైన జీవితాల గురించి రాసిన కవితలు మరీ బాగున్నాయి.

“వేకువ-సంధ్య” కవితలో
“చెప్పలేని
దిగులు వ్యధతో
చలిని కప్పుకు వణికిన
ఒక రెండు చేతుల రాత్రి-”
నాకు అమెరికా వచ్చిన తొలినాళ్ళలో ఇంటి తాళంచెవిలేక, సహ రూమ్మేట్లు ఇంటిలో లేక వాళ్ళు వచ్చేవరకు ఇంటివెనుక బాల్కనిలో చేతులూ కాళ్ళూ పొట్టలోకి ముడుచుకొని తూట్లుపొడిచే చలినుంచీ కాపాడుకొనే విశ్వప్రయత్నం గుర్తుకొచ్చింది.
ఇక “అపరిచితం” లో
“కలధూళి ఎగిసి
కన్నీరు గరగరలాడకుండా
నల్లని రే-బాన్ గ్లాసెస్ పెట్టచ్చు

రాత్రి
నిద్రలేమి కత్తులై కోయకుండా
ఎలక్ట్రిక్ హీటర్లలో
మొహం దాచుకోవచ్చు”

సహజత్వం లేని వస్తుజీవితాలని గుర్తుచేసింది.

“ఒక్క ముచ్చట” తెలంగాణా వుద్యమానికి మోసం చేసి పబ్బాలు గడుపుకొనే రాజకీయనాయకులకు హెచ్చరిక చేస్తుంది.

ఎంత చెప్పినా ఈ కవితలన్నీ చదివితీరాల్సినవి. శివారెడ్డి గారు, ఎన్.వేణుగోపాల్ గారు తమ ముందుమాటల్లో చక్కగా వివరించారు.

– ప్రసాద్