ఇప్పుడు ప్రజా ప్రథినిధులనిపించారు!

తేది:December 12, 2009 వర్గం:వర్తమానం రచన:చరసాల 347 views

మొన్న రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పటినుంచీ నేను మన ప్రజాస్వామ్యానికి అర్థం వెతుకుతూనే వున్నాను. మెజారిటీ ప్రజల అభీష్టం, రాజ్యాంగ విలువలు వగైరా అన్నీ కూడా నేతిబీరకాయ లోని నెయ్యి చందమని పూర్తిగా అర్థమయ్యింది. ఇక్కడ నా అయిష్టం రోశయ్య ముఖ్యమంత్రి అవ్వడం మీద కాదు, అయిన విధానం మీద. ఈ తతంగం అంతటిలోనూ ప్రజల విశ్వాసాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పుడెప్పుడో రాజు చనిపోయి, తనకు వారసులెవ్వరూ లేకపోతే ఆస్థాన ఏనుగు ఎవరో ఒకరి మెడలో మాల వేసి రాజును చేసేదట! అది కథేనో లేక నిజమో తెలియదు గానీ, ఇప్పుడు జరిగింది అంతకంటే భిన్నంగా లేదు. కాకపోతే ఇక్కడ ఏనుగుకి బదులు సోనియా గాంధీ ఆ పని చేశారు.

ఈ పరిణామాలు, నాయకుల బహిరంగ వాఖ్యానాలూ ఎలా వున్నాయంటే ప్రజల ప్రాపు కోసం ఎవ్వరూ ప్రాకులాడక్కర లేదు, అధినేత్రి కరణ కురిస్తే చాలనుకుంటున్నారు. ఇది ఎంతవరకూ వెళుతోందంటే ప్రజాస్వామ్యపు మూలాన్నే కూలగొట్టేవరకు! నిజానికి తన నియోజక వర్గపు మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని ఆ నియోజక వర్గ ప్రథినిధి మోయాలి. తన పార్టీ మెజారిటీ ప్రథినిధుల అభిప్రాయాన్ని ఆ పార్టీ అనుసరించాలి. కానీ అంతా తల్లకిందులు! చివరికి ఇప్పటి తరం ఈ తల్లకిందుల ఎవ్వారమే అసలైనదిగా భావించేటట్లు ఇది ముదిరిపోయింది.

ప్రజల అవసరాలు ఏ మంత్రికీ పట్టడం లేదు. రోశయ్య మాట మాటకీ తను ప్రజలకు బాద్యత వహిస్తున్నానే మాటే మరచిఫొయి, అమ్మ ఆజ్ఞ ఏదైయితే అది పాటిస్తా అంటూ పదే పదే వల్లె వేయడం ఏమాత్రం రుచికరంగా లేదు. ఇలా తను ఏదంటే అదే నోరెత్తకుండా వినే ఆంధ్ర ఎంపీలంటే ప్రధానికైనా, అమ్మకైనా ఎంతో ప్రేమ! వాళ్ళేం చెప్పినా చెల్లుతుందనే ధీమా జగన్ తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కోవటంతో బాగా పెరిగినట్లుంది. అందువల్లనే కేవలం ఒకటి రెండు రోజుల కంటితుడుపు కసరత్తుతో తెలంగాణాకు అనుకూల ప్రకటన చేసేశారు. మనకు ఎదురేంటి అనే బలుపు కనిపిస్తోంది ఆ ప్రకటన వెనుకాల. కాకపోతే కేసీయార్ నెల ముందునుంచే ధీక్ష గురించి చెప్పినా చెవికెక్కలేదు. దీక్ష మొదలయ్యాకా చీమకుట్టినట్లు లేదు. తీరా అతని ఆరోగ్యం బాగా క్షీణించాక, విధ్యార్థుల ఆగ్రహం పెరిగాక అప్పుడు హడావుడిగా ఇక్కడో గంటా, అక్కడో గంటా చర్చించి ఆనక నిర్ణయం చెప్పడం! ఇందులో ఎక్కడా ప్రజల మాట గురించి పల్లెత్తు మాట లేదు.

హమ్మయ్య, ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాలు చూశాక నాకు కాస్తా తృప్తిగా వుంది. నా తృప్తి సమైఖ్యాంద్ర వుద్యమం గురించి, అది బలపడటం గురించి కాదు. కనీసం ఈ ఒక్క విశయంలోనైనా తమ రాజీనామా నిర్ణయం తమ పార్టీ నాయకుణ్ణి బట్టో లేక అధిష్టానాన్ని బట్టో గాక ప్రజల నాడిని బట్టి తీసుకున్నందుకు!

ఇది కాంగ్రెస్ స్వంత వ్యవహారమా?

తేది:September 30, 2009 వర్గం:వర్తమానం రచన:చరసాల 458 views

 ఒక నల్లవాడు అమెరికా అధ్యక్షుడైనా, అకస్మాత్తుగా వైస్సార్ గల్లంతైనా చలించని నేను ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ తంతు చూస్తుంటే మాత్రం స్పందించకుండా అదే నా ఏడుపు ఏడవకుండా వుండలేకున్నాను.

నేను కాంగ్రెసు పక్షపాతినసలే కాదు. అయితే మాత్రం ఈ రాజ్యాంగభంగాన్ని సహించాల్సిందేనా? తెలుగువాడికి జరిగే అవమానాన్ని భరించాల్సిందేనా? ఎవరెన్ని చెప్పినా రాజశేఖర రెడ్డి లేనిదే కేవలం సోనియా బొమ్మ చూసి రాష్ట్ర ఓటర్లు కాంగ్రెసును మళ్ళీ అధికారంలోకి తెచ్చారంటే నేను నమ్మను. తను ఒంటిచేత్తో అటు మూకుమ్మడిగా కట్టగట్టిన మహాకూటమిని ఇటు స్వంత పక్షంలోని అస్మదీయులనీ ఎదుర్కొని విజయం సాధించాడు. అలాగని ఆయన కొడుకు ముఖ్యమంత్రి పదవికి అర్హుడని నేననను. ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్‌కున్న అర్హతే జగన్‌కూ వుంది. అందుకో, ఇందుకో ఎందుకో అధిక శాసనసభ్యుల మద్దతూ వుంది. అది చాలు కదా రాంజ్యాంగ నిభందనలను సంతృప్తి పరచడానికి.

మన ప్రజాస్వామ్యంలో మెజారిటీ భావన నేతిబీరకాయలో నెయ్యి లాంటిదేనని అందరికీ తెలిసిందే. ఇక కాంగ్రెసులోనయితే మరీను. అక్కడ పైవాడి ఒక్క ఓటు ప్రజలందరి ఓటుతో సమానం. మన్మోహన్ సింగ్ ఆ ఒక్క ఓటుతోనే ప్రధాని అయ్యుండవచ్చు. రాజసేఖర రెడ్డీ అలానే అయ్యుండవచ్చు. అయితే కనీసం రాజ్యాంగ బద్దం అనిపించడానికి “మమ” అనే తంతు జరగాలిగా, మనందరికీ అది తంతేనని తెలిసినా! రాష్ట్రపతికి సోనియా మద్దతు లేఖ ఒకటే సరిపోతుందా మన్మోహన్ ప్రధాని కావడానికి? మెజారిటీ MPల మద్దతు వుందని చూపక్కరలేదా? అలానే ఎంత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నా, శంఖంలో పోసిందే తీర్థమయినట్లు మెజారిటీ ఎమ్మెల్యేలతో చెప్పిస్తేనేగదా ముఖ్యమంత్రి అయ్యేది.

 ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం చూస్తే “ముఖ్యమంత్రిని ఎవరు ఎన్నుకుంటారు?” అన్న ప్రశ్నకి “సోనియా గాంధీ” అని విధ్యార్థులు సమాధానం రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు. ఎందుకంటే మన కాంగ్రెసోళ్ళు ఉపాద్యాయులైతే అదే సత్యమంటారు.

ఇంతకు ముందు అధిష్టానం నుండి ఓ దూత రహస్య సందేశం తెచ్చేవాడు. ఆ సందేశం ప్రకారం ఇక్కడ ఎమ్మెల్యేలు తమ నాయకున్ని ఎన్నుకునేవారు. ఛ ఛ అంత రహస్యం ఎందుకనుకున్నారో ఏమో గానీ ఇప్పుడదే సంప్రదాయమయిపోయింది. ముంఖ్యమంత్రి చనిపోయి నెలవుతున్నా CLP సమావేశం గానీ దాని వూసు గానీ లేకుండా రోశయ్యే CLP నాయకుడని చెప్పేవాళ్ళకి బుర్రలో గుజ్జు వుందా? లేకుంటే మనమేం చెప్పినా వినే తెగులున్నవాళ్ళే తెలుగువాళ్ళు అన్న నిశ్చయానికి డిల్లీ పెద్దలు వచ్చారా?

ఏదేమయినా ఇది కాంగ్రెసు స్వంత వ్యవహారం కాదు. రాజ్యాంగ సూత్రాలకు అవమానం. పదవిలో వుండి మరణించిన తెలుగు నాయకుడికీ, ప్రజలకూ అవమానం.

నటనైనా అవసరం

తేది:September 30, 2009 వర్గం:అనుభవాలు రచన:చరసాల 385 views

బ్లాగ్లోకానికి దూరమై ఏడాదిపైన అయింది. మొన్న జరిగిన ఓ ఘటన మదిలో తొలిచేస్తూ ఏదోవిధంగా బయటపడాలని చూస్తోంది. కనీసం బ్లాగితేనయినా ఆ బాధ తగ్గుతుందేమోనని ఇలా కీబోర్డు పట్టాను.

గత శుక్రవారం (సెప్టంబరు 25) ఇక్కడ గాయని సునీత కార్యక్రమం వుండింది. అందుకు సంబందించిన ప్రకటన ఇక్కడ చూడండి. అందులో “శ్రియ” కనిపిస్తుందని పెద్దగానే ప్రకటించారు.  

Sunitha

నాకు సునీత పాటలను వినాలనే ఆశ కొంతైంతే శ్రియనూ చూడాలన్నదీ కొంత. మా ఇంటినుండీ ఈ కార్యక్రమం జరిగే ప్రదేశం గంటకు పైనే దూరం. అయినా టైర్లీడ్చుకుంటూ అంతాదాకా వెళ్ళి గంటన్నర ఆలస్యంగా మొదలైన ప్రోగ్రాంని కళ్ళూ, చెవులూ అప్పగించి చూస్తే తీరా శ్రియ గురించిన వూసే లేదు.

కార్యక్రమం మధ్యలో విరామ సమయంలో ఆయనెవరో నిర్వాహకుడు గాయకులనీ, వాద్యకారులనీ పరిచయం చేస్తుంటే “శ్రియ” “శ్రియ” అని జనాలు కేకలేస్తుంటే, ఆ నిర్వాహకుడు పొరపాటున కూడా శ్రియ గురించి మాట్లాడలేదు. పైగా “మా మాట నమ్మి వచ్చిన మీరంతా వెర్రి వెధవాయిలు” అనుకుంటున్నట్లు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.

శ్రియ వస్తుందని ప్రకటనలో చెప్పిన నేరానికి కనీసం ప్రేక్షకులకి క్షమాపణో, సంజాయిషీనో ఇవ్వాల్సిన అవసరం వున్నట్లు ఆ పెద్ద మనిషికి గానీ ఇతర పెద్ద మనుషులకుగానీ తోచలేదు. తోచే వుంటుంది, వచ్చిన వారు వాళ్ళకి వెధవల్లా కనపడ్డప్పుడు బాధ పడుతున్నట్లు నటించడం కూడా శుద్ద దండగ అనుకుని వుంటారు.

వివాహ మహోత్సవ ఆహ్వానం

తేది:August 3, 2008 వర్గం:వర్తమానం రచన:చరసాల 1,581 views

శ్రేయోభిలాషులందరికీ మా తమ్ముడు దిలీప్ పెళ్ళికి బ్లాగ్ముఖ ఆహ్వానపత్రం.

పెళ్ళి పత్రిక

మొసలి కన్నీరు

తేది:August 1, 2008 వర్గం:నా ఏడుపు రచన:చరసాల 1,245 views

మనది కర్మ భూమి. “ఇది మన కర్మ, ఎవరిని నిందించి ఏమి ప్రయోజనం?”, “ఎప్పుడో చేసుకున్న పాప ఫలం ఇప్పుడు ఇలా అనుభవించాడు(రు).” ఇలా అనుకునే జనాలు, ఇలాంటి తలాతోకా లేని వాజమ్మ సిద్దాంతాలూ నమ్మే వారూ, వాటిని పకడ్బందీగా ప్రచారం చేసే ఉద్దండ పండితులూ వున్నంత కాలం, కాకతీయ ఎక్స్‌ప్రెస్ కాలుతుంది, గౌతమి మండుతుంది, బెంగుళూరు పేలుతుంది, అహ్మదాబాదు హాహాకారాలు చేస్తుంది.

ఎన్ని జరిగినా మనకు కానీ మన నాయకులక్కానీ చీమకుట్టినట్లుండదు. ఇవన్నీ కంటి తుడుపు మాటలు. నోట్లోంచీ వూడిపడేవే, గుండెలోతుల్లోంచీ వచ్చేవి కావు. తన ప్రాణం తప్ప ఏ ఇతర ప్రాణమూ మనకు తీపి కాదు. ఏ అమ్మకూ తన బిడ్డల ప్రాణం తప్ప మరే బిడ్డ ప్రాణమూ ముఖ్యం కాదు. అదేమంటే ఇలా ప్రమాదం జరిగీ జరగ్గానే అలా “చింతిస్తారు” లేదా “ప్రాణాలకు వెల కడతారు.” ఎంత సిగ్గులేని బ్రతుకులు!

బస్సులూ, రైల్లూ ఈ రోజే కొత్తగా పుట్టలేదు. వాటిల్లో క్షేమంగా ప్రయాణించడమెలాగో ఈరోజు మనమే ఓ కమిటీ వేసి తేల్చాల్సిన పని లేదు. ఈ పాట్లు అన్నీ పడి, అనుభవంతో సమస్య పరిష్కారాలు కనుక్కున్న వారిని చూసి మనం నేర్చుకుంటే చాలు. అది చూసి వస్తాం, ఇది చూసి వస్తాం అంటూ పెద్ద దేశాలకు ప్రయాణాలు కట్టే ఈ వంచకులు నిజంగా ఏమైనా చూసి నేర్చుకుంటారో లేక యాత్రా విహారాలు చేస్తారో గానీ… రైలు బోగీ నిర్మాణం ఎలా వుండాలో వీరికి తెలియదనుకోవాలా?

ఉదాహరణకు ఇక్కడి మార్క్ రైలులో వున్న సదుపాయాలు చూద్దాం. ప్రతి బోగీలోనూ ఆ చివరా ఈ చివరా ఓ గొడ్డలి, ఱంపమూ కనిపించేలా ఓ గ్లాస్ డోర్ వెనుకాల వుంటాయి. మామూలుగా ఆ తలుపుకు తాళం వేసి వుంటుంది. అయితే ఆ అద్దం మీద “అత్యవసర సమయాలలో పగుల గొట్టండి.” అని వ్రాసి వుంటుంది. అలాగే ఆ చివరా, ఈ చివరా మంటల నార్పడానికి వుపయోగించే అగ్ని నిరోధక సాధనం వుంటుంది. దానిని క్రితం సారి ఎప్పుడు తనిఖీ చేశారో, మళ్ళీ తనిఖీ ఎప్పటిలోగా చేయాలో వ్రాసి వుంటుంది. ఇక అన్నిటినీ మించి ఇంచుమించు ప్రతి కిటికీ అత్యవసర సమయాలలో నిష్క్రమణ ద్వారంగా పనిచేసేలా రూపొందిస్తారు. అత్యవసర సమయాలలో ఆ కిటికీని ఎలా తెరవాలో స్పష్టంగా ప్రతి చోటా అక్షరాలలోనూ, బ్రెయిలీలోనూ వ్రాసి బొమ్మలతో సూచిస్తారు. భోగీ లోపల ఏ కిటికీ నిష్క్రమణ ద్వారంగా మార గలదో భోగీ వెలుపల కూడా సూచిస్తారు. (బహుశా బయటి వారు సహాయ పడలనుకునే సందర్భాలలో వుపయోగ పడుతుందనేమొ!)

వీటిల్లో ఏ ఒక్కటైనా గౌతమిలో వుండి వుంటే ఈ ప్రమాదంలో ఇంత మంది చనిపోయేవారా? ఖచ్చితంగా కాదు. మన అధికారులకు, నాయకులకు ఇలా ఒకన్ని చూసి నేర్చుకునే అలవాటు లేదు. తమకుగా తెలుసుకోరు.

ఇక ప్రజలా దున్నపోతులు. “మన కర్మ” అనే దళసరి చర్మం కప్పుకున్న స్పందన రహితులు. ఈ “కర్మ సిద్దాంతమే” మనకు బలం, బలహీనతా.

రోజూ ఇక్కడ లిప్ట్ ఎక్కినప్పుడల్లా హైదరాబాదులో ఎక్కిన లిప్టులు గుర్తుకు వచ్చి మనస్సు చివుక్కు మంటుంది. ఇక్కడి లిప్టులకు ఆటోమాటిక్‌గా మూసుకునే దళసరి ద్వారం వుంటే, అక్కడి వాటికి చాలా మట్టుకు “గ్రిల్” వుంటుంది. గ్రిల్ మూశాక చిన్న పిల్లలు పొరపాటున ఆ గ్రిల్‌లో చేతులు పెడితే ఏమవుతుంది? ఇలాంటి చిన్న ప్రమాదాలనీ నివారించలేని అశక్తులమా మనం? పోనీ అక్కడి లిప్టులు తయారుచేసే కంపెనీలకు ఈ విషయం తెలియదనుకోవాలా? కానే కాదు. అవి చేసే వారే ఇక్కడా చేస్తున్నారు.

అలాగే మా వూరిలో మా యింటితో సహా గమనించిందేమంటే, డాబా మీద పిట్ట గోడకు (రక్షణ గోడ) అమర్చిన గ్రిల్. ఇక్కడెక్కడా నిలువు వూచలే తప్ప అడ్డు వూచలున్న గ్రిల్ చూడలేదు. కానీ అక్కడ మా యింటితో సహా అడ్డమూ, నిలువూ వూచలున్నాయి. అడ్డంగా నిచ్చెనలా వుంటే పిల్లలకు ఎంత సులభం వాటిని ఎక్కి ఆడుకోవడం? అలా పైపైకి వెళ్ళి కిందికి చూసేటప్పుడు పొరబాటు జరిగితే ఎంత ప్రమాదం?

వుహు. మన దళసరి చర్మానికి ప్రమాదం జరిగాక ఏడవడమే గానీ ముందుగా అది జరగ్గుండా ఏమి చేయాలన్న ఆలోచనే రాదు. పోనీ పక్కవాన్ని చూసి నేర్చుకుంటామా అంటే అదీ లేదు.

మనం కర్మను నమ్ముకున్నన్నాళ్ళూ మన కర్మ ఇంతే!

–ప్రసాద్